ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై లంచం ఆరోపణలు చేసిన ఆ పార్టీ నేత కపిల్ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే పిడిగుద్దులు కురిపించారు. ఢిల్లీలో ఈ రోజు కపిల్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ ప్రాంతం వద్దకు ఆప్ కార్యకర్తలు కొంత మంది వెళ్లారు. అయితే, కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడేందుకు యత్నిస్తున్న సందర్భంలో ఆయనపై అంకిత్ భరద్వాజ్ అనే కార్యకర్త పిడిగుద్దులు గుద్దాడు. కపిల్ మిశ్రా జుట్టు, రెండు చేతులు పట్టుకుని కార్యకర్తలు దాడికి దిగారు. అయితే, వారిపై ప్రతిదాడికి దిగవద్దని కపిల్ తన వర్గీయులకు చెప్పడం గమనార్హం.