ఆలయ అర్చకులకు వంశపారంపర్య హక్కులు సక్రమింపజేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్క తిరుమల శ్రీవారి ఆలయం మినహా అన్ని ధార్మిక సంస్థల అర్చకులకు ఈ వంశపారంపర్య హక్కులు సంక్రమించేలా జీవో 439 విడుదల చేసింది. దీంతో పాటు అర్చకులకు, పూజారుల నియామకానికి సంబంధిచిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
జీవో విడుదలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్చక సమాఖ్య ప్రతినిధులు తమ కృతఙ్ఞతలు తెలిపారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా స్పందించారు. హిందూ, దేవాదాయ, ధార్మికతను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
2007లో అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. గత పదేళ్లుగా ఈ చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయలేదు. YCP అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాదయాత్రలో అర్చకులు కలిసినప్పుడు ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలో చేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.