బెంగళూరు: ఇండియన్ ప్రీమియరర్ లీగ్ 10లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యంత ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటి వరకూ ఏ ఐపీఎల్లోనూ ఇంత చెత్తగా కోహ్లీ జట్టు ఆడలేదేమో. శుక్రవారం కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచులో కోహ్లీతోపాటు విధ్వంసకర బ్యాట్స్మెన్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, కోహ్లీలు పూర్తిగా విఫలమయ్యారు. ఈ సీజన్లో ఒకటి రెండూ మ్యాచులు మినహా వీరంతా పెద్దగా చెప్పుకునే ప్రదర్శనైతే చేయలేదు. తుపాను ఇన్నింగ్స్ ఆడగల క్రిస్ గేల్, ఎలాంటి పరిస్థితిలోనైనా జట్టును ఒంటిచేత్తో గెలిపించగల విరాట్ కోహ్లీ, బంతిని ఎక్కడేసినా బౌండరీకి బాదేస్తా అన్నట్లుండే ఏబీ డివీలియర్స్.. ఈ సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. కనీసం 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేదంటే ఇంత మంది పెద్ద ఆటగాళ్లు ఉండి ఏం ప్రయోజనమని ఆ జట్టు అభిమానులు వాపోతున్నారు.
తొలి ఆట గెలుపు,ఓటమిల అసలు కారణాలు.. ఏమైందీ జట్టుకి.. అసలు ఈ జట్టుకు ఏమైందని సందేహిస్తున్నారు. సుడిగాలిలా విజృంభించే క్రిస్ గేల్.. ఈ సీజన్ మొత్తమ్మీద ఆడింది ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్. గుజరాత్ లయన్స్ జట్టు మీద రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో 77 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడితే ఒక దాంట్లో డకౌట్, మిగిలిన వాటిలో డబుల్ డిజిట్కు వెళ్లింది కేవలం రెండు సార్లు మాత్రమే. అది కూడా మరీ పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కావు. అంతంత మాత్రమే.. ఒకటి ముంబై ఇండియన్స్ మీద 22, మరోటి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 32.. మిగిలిన మ్యాచ్లలో గేల్ స్కోర్లు 8, 7, 6. కోహ్లీ కొంత పర్వాలేదనిపించినా దానివల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. కోల్కతా మీద మ్యాచ్లో డకౌట్ అయిన కోహ్లీ.. పంజాబ్ జట్టు మీద కేవలం 6 పరుగులే చేసి సందీప్ శర్మ చేతిలో ఔటయ్యాడు. మిగిలిన వాటిలో కూడా 10, 20, 28 పరుగులు చేశాడు. రెండుసార్లు మాత్రం అర్ధసెంచరీలు కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి. హిట్టర్లున్నారు.. కానీ.. శుక్రవారం నాటి మ్యాచ్లో 138 పరుగులకే పంజాబ్ జట్టును కట్టడి చేయడంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బెంగళూరు జట్టు గెలుస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, సొంత మైదానం అయినా.. ఎదురుగా ఉన్నది అతి సాధారణ లక్ష్యమే అయినా కూడా బెంగళూరు ఆటగాళ్లు తడబడ్డారు. జట్టులో ఉన్న ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే కావడం గమనార్హం.