ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విషాదం చోటుచేసుకుంది. తహసీల్దారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అకారణంగా తిట్టినందుకు మనస్తాపానికి లోనైనా ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన యర్రగొండపాలెంలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షేక్ జుబేద (20) ఇటీవల గ్రామ వాలంటీర్ గా ఎన్నికైంది. శుక్రవారం రాత్రి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న శివప్రసాద్ చారి, ఆమె ఇంటికి వెళ్లాడు. రికార్డులు పూర్తి చేసి శనివారం ఉదయం వరకు తన టేబుల్ పై ఉంచాలని ఆదేశించాడు. విధులు సరిగ్గా నిర్వహించడం లేదని, ఇలాగే ఉంటే ఉద్యోగం ఊడుతుందని అవమానకరంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆమె బాత్రూంలో ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆపరేటర్ శివప్రసాద్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు