25 ఏళ్ల అందమైన మహిళ వలపు వల విసురుతూ కోట్లలో సంపాదించాలని ఆశపడింది. మాజీ ఎయిర్ హోస్టెస్ అయిన ఆ మహిళ భర్తతో కలిసి దిమ్మతిరిగే ప్లాన్ లు వేసింది. మత ప్రచారకునికి వల విసిరి ఏకంతా దృశ్యాలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల్లో డబ్బు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో దంపతులిద్దరూ కటకటలా పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత ఆగస్టులో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో మత ప్రచారకుడి దగ్గరకు వెళ్లిన మహిళ అతనితో మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్లింది. తరచూ వాట్సప్ లో చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దించింది. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ లంచ్ లేదా డిన్నర్ కు ఎటైనా వెళ్దామని చెబుతూ తన బుట్టులో వేసుకుంది. ఈ క్రమంలో చిలుకూరు మృగవని పార్క్ కు తీసుకెళ్లింది. మరోసారి శంషాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు, మూడోసారి వండర్ లా కు తీసుకెళ్లి 100కు పైగా సెల్పీలు దిగింది. వీరిద్దరు మాట్లాడుకుంటూ కలిసి తిరుగుతుండగా వారి మనుషులు ఫోటోలు దించేవారు.
తర్వాత మత ప్రచారకుడితో చనువుగా ఉంటూ అసలు మోసానికి తెరలేపింది. తన భర్త విజయవాడలో హోటళ్ల వ్యాపారం చేస్తున్నాడని, ఓ పెద్ద హోటల్ ను స్టార్ట్ చేసేందుకు రూ.10లక్షలు అవసరం ఉందని చెప్పి తీసుకుంది. హోటల్ వ్యాపారానికి సంబంధించిన విషయంపై మాట్లాడేందుకు కొంతమంది తమ వారు వస్తారని చెప్పి శంకర్ పల్లిలోని ఓ రిసార్ట్ కు రప్పించింది. అతడు అక్కడికి వెళ్లాక హోటల్ ప్రతినిధులు అతన్ని ఓ గదిలో ఉండమన్నారు. రాత్రి 10గంటల సమయంలో సడన్ గా అతని ముందు ప్రత్యక్షమైంది.
ఇద్దరు కలిసి బెడ్ పై కూర్చుని మాట్లాడుకుంటుండగా అతనికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్నాక అతని ఒంటిపై బట్టలను తీసేసి అతడితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫోటోలు, వీడియోలు తీసింది. ఉదయం ఆ మతప్రచారకుడికి మెలకువ వచ్చే సరికి బాత్ రూమ్ లోని టబ్ లో ఉన్నాడు. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఆ మహిళ భర్త సడన్ గా స్నానాల గదిలోకి వచ్చి మత ప్రచారకుడిని ఓ గదిలో బందించాడు. భార్యను, బాధితుడిని చితకబాది తుపాకీ తీసి చంపేస్తానని బెదిరించాడు. బాధితుడు ప్రాధేయపడటంతో కోటిరూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పేపర్ పై సంతకం చేయించుకున్నాడు. మరుసటి రోజు ఫోన్ చేసి రూ.20లక్షలు ఇవ్వాలని కోరడంతో రూ.10లక్షలు ఇచ్చాడు.
డబ్బుల కోసం వేధింపులు పెరగడంతో అతడు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విషయాలు మొత్తం తెలుసుకున్నారు. ఆ మహిళ భర్త గతంలో హైదరాబాద్ లో హోటళ్ల వ్యాపారం చేసేవాడని, వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇలాంటి దందాలకు దిగారని, నాంపల్లిలో డూప్లికేట్ తుపాకీ కొని మోసాలకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ మహిళ ఓ ఎన్ఆర్ఐకి కూడా వలపు వల విసిరినట్లు పోలీసులు గుర్తించారు.