ప్రభుత్వ, ప్రభుత్వేర సమాచారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో మీడియా ( పత్రికలు, చానళ్లు, సోషల్ మీడియా) తనదైన కీలక పాత్ర పోషిస్తుంది. ఏ ప్రభుత్వం చేయలేనటువంటి సాహసం జగన్ ప్రభుత్వం చేస్తోంది.. దీనిపై ఒక సర్క్యూలర్ జీవో జారీచేసింది.. మీడియా స్వేచ్ఛపై ప్రత్యేక కథనం...
ఏ మీడియా లో నైనా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే కేసులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది సంగతి తెలిసిందే. ఈమేరకు బుధవారం నిర్వహించిన కేబినెట్ భేటీలో ఒక తీర్మానం కూడా చేశారు .దీని పట్ల జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి సీఎం జగన్ తండ్రిగారైన వైయస్సార్ కూడా ఇదే తరహా బ్లాక్ జీవో తెచ్చారు. దీనికి మరిన్ని కోరలు జత చేస్తూ జగన్ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. పత్రికలు, టీవీ చానళ్లు,చివరకు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలు వస్తే ఇరవై నాలుగు గంటల లోపు కేసులు దాఖలు చేసే అధికారాన్ని అన్ని శాఖల కార్యదర్శులకు ఈ జీవో ద్వారా కట్టబెట్టారు. సంబంధిత శాఖల ప్రాసిక్యూటర్ల ద్వారా ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారికి సూచించింది . కాగా బుధవారం నిర్వహించిన క్యాబినెట్ భేటీలో కాసేపు మీడియా ను నియంత్రించడం ఎలా అన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దశలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గతంలో వైఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను జగన్ కి అందజేశారని ,దీనిపై చర్చించాక వెనువెంటనే కొత్త సర్కులర్ జారీ చేశారని తెలుస్తోంది. పాత జీవో తో పోలిస్తే కొత్తగా జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంక్షలతో మీడియాకు సంకెళ్లు పడడము ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై అప్పుడే పత్రికా రంగంలో మీడియా రంగంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.