బిర్యానీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరాల్సిందే. బిర్యానీకి ఒక్కో ఏరియాలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ వాసన చూడగానే నాలుక తహతహలాడుతుంది. ఎప్పుడు తిందామా.. ఎప్పుడు తిందామా అని. నచ్చిన బిర్యానీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి భోజన ప్రియులు ఆరగించి వస్తారు. ఇక ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ వచ్చాక బిర్యానీకి మరింత గిరాకి పెరిగింది. నచ్చిన రెస్టారెంట్ లేదా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుంటున్నారు. బిర్యానీకి ఖర్చు ఎంతైనా లెక్క చేయకుండా తినేస్తుంటారు. అటువంటిది 5 పైసలకే బిర్యానీ ఇస్తామని ఆఫర్ ఇస్తే ఇక భోజన ప్రియులు ఆగుతారా మరీ.
తమిళనాడులో 5 పైసలకే బిర్యానీ ఆఫర్ ప్రకటించాడు ఓ హోటల్ యజమాని. తమిళనాడులోని దిండుక్కల్ బస్టాండ్ సమీపంలో ముజిఫ్ బిర్యానీ సెంటర్ ఉంది. ఇక్కడ 5 పైసలకే బిర్యానీ అందిస్తామని హోటల్ యజమాని ప్రకటించాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న భోజన ప్రియులు బుధవారం ఉదయం నుంచే షాపు దగ్గరు క్యూ కట్టారు. ఈ బిర్యానీని 5 పైసలు తీసుకు వచ్చిన వారికే ఇవ్వడం గమనార్హం. వేరే వారికి ఇవ్వలేదు. ఎవరైతే 5 పైసలు తీసుకు వస్తారో వారికి మాత్రమే ప్లేట్ బిర్యానీని అందించారు.
భవిష్యత్ తరాలకు మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపైన అవగాహన కల్పించేందుకే 5 పైసల బిర్యానీ ఆఫర్ పెట్టామని యజమాని అన్నారు. ఇలా 5 పైసల నాణేలు సేకరించామని బిర్యానీ సెంటర్ యజమాని తెలిపారు. అయినా 5 పైసల నాణేలను ఇంకా దాచుకోని చాలా మంది తీసుకు వచ్చారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఆఫర్ ను కేవలం బుధవారం ఒక్కరోజుకు మాత్రమే పెట్టారు.