ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ చాతుర్యం పరిశీలకులనే ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన వై.ఎస్.ఆర్ రైతు భరోసా పథకం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలుకానున్నది. జగన్ ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా అన్న పేరు ఖరారు చేశారు అయితే ఆ పేరు కి చివర పీఎం కిసాన్ యోజన అన్న పదాన్ని చివరి నిమిషంలో జోడించారు. తద్వారా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకునే పధక రచన జగన్ తనదైన శైలిలో మలిచారు. ఇటీవలి కాలంలో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి, బిజెపి నేతల వ్యవహార సరళి కాస్త భిన్నంగా ఉంది. అదీగాక అమిత్ షా ఇటీవల ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ని పిలిపించుకుని మాట్లాడడం జగన్ ను ఆలోచనలో పడవేసినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. రాధాకృష్ణ ద్వారా మళ్లీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ బీజేపీకి దగ్గరవుతోందోనన్న ఆలోచనా జగన్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. చంద్రబాబు ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం టీడీపీ చేసిన తప్పిదం అని పలుమార్లు చెప్పటం గమనార్హం. తద్వారా తిరిగి బీజేపీకి దగ్గర కావటానికి టిడిపి సన్నద్ధమవాలనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు. బిజెపి టిడిపి మైత్రికి రాధాకృష్ణ నిచ్చెన లాగ ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదని జగన్ గ్రహించారు. ఇది జరగకుండా ఉండాలంటే ప్రధాని మోడీ ని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం అని జగన్ లెక్కలు వేశారు. ఇందుకు నాందిగా రైతు భరోసా పథకం మొదట తన తండ్రి పేరును, చివర పి.ఎం అన్న పదాన్ని జగన్ చేర్చారు. ఆ విధంగా బిజెపి నేతలని నోరెత్తకుండా చేశారు. ప్రధాని మోడీని సంబర పరిచారు. టీడీపీని బీజేపీకి దూరం చేశారు. తద్వారా ఒకే దెబ్బకు జగన్ రెండు పిట్టలను కొట్టారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా తయారయింది.