ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్‌షిప్‌లో భారత్ అగ్రస్థానం మరింత పటిష్టం!

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 07:23 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పుణె వేదికగా ఆదివారం రెండో టెస్టు ముగియగా.. టీమిండియా ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో.. మరో 40 పాయింట్లని ఖాతాలో వేసుకున్న భారత్ జట్టు.. మొత్తం 200 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ప్రతి సిరీస్‌కి ఐసీసీ 120 పాయింట్లు కేటాయిస్తుండగా.. సిరీస్‌లో మ్యాచ్‌ల ఆధారంగా వాటిని విభజిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది.ఈ ఏడాది ఆగస్టు నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడిన భారత్ జట్టు.. రెండింటిలోనూ గెలుపొంది 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచి 40 పాయింట్లు.. తాజాగా పుణె టెస్టులో గెలిచి మరో 40 పాయింట్లని దక్కించుకుంది. మొత్తంగా... 200 పాయింట్లతో పట్టికలో భారత్ నెం.1 స్థానంలో నిలిచింది. తర్వాత వరుసగా న్యూజిలాండ్ (60), శ్రీలంక (60), ఆస్ట్రేలియా (56), ఇంగ్లాండ్ (56) టాప్-5లో నిలిచాయి. మిగిలిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com