బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు తమిళ స్మగ్లర్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తిరుమల నుంచి ఎర్ర చందనం దుంగలు రవాణా చేసేందుకు ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ పోలీసు లు అలిపిరి వద్ద పక్కా సమాచారం తో పట్టుకున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, ఇతరటీమ్ లు శేషాచలం పరిసరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనల తో ఆ ఎస్ ఐ వాసు, డీఆర్ ఒ పివి నరసింహారావు టీమ్ తిరుమల నుంచి వచ్చే వాహనాలపై దృష్టి పెట్టారు. టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి మొదటి ఘాట్ రోడ్డులో అలిపిరికి ముందు కాపు కాశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఒక టాటా సఫారీ వాహనం, పూజలు చేసుకుని వస్తున్నట్లు , వాహనం ముందు భాగాన పూలతో అలంకరించి వస్తూ కనిపించింది. టాస్క్ ఫోర్స్ టీం ఆ వాహనాన్ని అడ్దగించారు. అందులో 13 ఎర్ర చందనం దుంగలు లభించాయి. దుంగలతో పాటు నలుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారు తమిళనాడు ధర్మపురి జిల్లా చిట్టేరి పంచాయతీకి చెందిన మురుగేశన్ జయపాల్ (25), రామలింగం అరుణాచలం (30), భూపాల్ కందస్వామి (27), డ్రైవర్ పెరుమాళ్ వేలు (35) గా గురించారు. TN 07 AL 3903 నెంబరు కల ఈ వాహనం ఇది వరకు ఐదు సార్లు తిరుమల కు వచ్చి ఎర్ర చందనం దుంగలను రవాణా చేసినట్లు విచారణ లో తెలిసింది. ఈ వాహనం తిరుమల నుంచి రెండు టోల్ గేట్లను దాటుకుని వెళుతోంది. దీనిపై నిఘా లేకపోవడం తో అక్రమ రవాణా యదేచ్చగా సాగుతోంది. స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.