పని మానేసి తనతో పాటూ జులాయిగా తిరగాలంటూ ఎన్నిసార్లు చెప్పినా వినని స్నేహితుణ్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి. ఈ దారుణం నెల్లూరుజిల్లా గూడూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలలోకి వెళితే. తెనాలికి చెందిన వేణు అనే వ్యక్తి గూడూరు రైల్వే స్టేషన్ లో రైళ్లలో తినుబండారాలు అమ్ముతూ వెండర్ గా జీవనం సాగించేవాడు. కొద్ది రోజులక్రితం తన స్నేహితుడు చరణ్ ను వెండర్ పనిలో కుదిర్చాడు. అయితే పని సక్రమంగా చేయడం లేదంటూ వేణును పనిలో నుండి తొలగించాడు యజమాని దీంతో నువ్వు కూడా పనిమానెయ్ అంటూ చరణ్ పై వేణు పదే పదే ఒత్తిడి తెస్తూ వచ్చాడు. ఈ విషయమై శుక్రవారం వేకువ ఝామున ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పెద్దదైంది. వేణు కత్తి తో చరణ్ పై విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. పరిస్థితి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న చరణ్ ను గూడూరులోని ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే ఆతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సిఫారసు మేరకు నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చరణ్ మృతి చెందాడని. గూడూరు 1వ పట్టణ పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.