హైదరాబాద్: పాకిస్థాన్తో డాగ్ఫైట్ జరుగుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ను మనం ప్రయోగించిన క్షిపణే కూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ భదౌరియా తెలిపారు. మన చాపర్ను మనం కూల్చివేయడం అతి పెద్ద తప్పిదమని ఆయన అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన సంఘటన గురించి ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. ఆ రోజున జమ్మూకశ్మీర్లోని బుద్గామ్లో ఎంఐ 17 హెలికాప్టర్ కూలిపోయింది. బాలాకోట్పై భారత వైమానిక దళాలు దాడికి వెళ్లిన మరుసటి రోజు ఈ ప్రమాదం జరిగింది. అయితే మనం వదిలిన మిస్సైళ్ల వల్లే ఆ హెలికాప్టర్ కూలినట్లు తేలింది. దీనిపై ఏర్పాటు చేసిన సైనిక కోర్టు విచారణ ముగిసిందని భదౌరియా తెలిపారు.