ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్.,ఆన్లైన్లో మోసా లు వరుసగా జరుగుతున్నా... కొందరు వాటి బారిన పడి మోసపోతూనే ఉండటం కామనైపోతోంది. ఈ క్రమంలోనే ఓ ఇంజనీరు జొమాటోలో భోజనం ఆర్డర్ చేస్తే వంద రిటన్ ఇస్తమన్న ఆఫర్ చూసి మోసపోయిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే పట్నాకు చెందిన విష్ణు అనే ఇంజనీర్ ఈ నెల 10న జొమాటోలో భోజనం కోసం ఆర్డర్ చేశాడు. తీరా భోజనం వచ్చాక పార్శిల్ విప్పి చూస్తు, ఆ భోజనం బాగా లేకపోవడం, కొంత వాసన వేస్తున్నట్టు అనిపించడంతో తిరిగి తీసుకెళ్లాలని డెలివరీ బాయ్ను కోరాడు.
ఈ విషయం జొమాటో కస్టమర్ కేర్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని బాయ్ చేసిన సూచనతో గూగుల్ సెర్చ్లో జొమాటో కస్టమర్ కేర్ నంబరును తెలుసుకుని ఫోన్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తి తను జొమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా పరిచయం చేసుకుని, వివరాలు చెప్పాలనటంతో, తను భోజనం ఆర్డర్ నుంచి అది డెలివరీ అయ్యాక పరిస్థితి గురించి చెప్పడంతో కస్టమర్లే తమకు దేవుళ్లని, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మీరు చెల్లించిన మొత్తానికి తోడుగా సంస్ధ బాగోగుల కోసం ఫిర్యాదు చేసినందుకు మరో రూ.వంద రీఫండ్ చేస్తామని, ముందు కేవలం రూ.10 డిపాజిట్ చేయాలని సూచించాడు. దీని కోసం విష్ణుకు ఓలింక్ పంపాడు.
తన డబ్బులతో పాటు అదనంగా మరోవంద వస్తోందని ఆలోచనలో ఉన్న విష్ణు సదరు ఉద్యోగి పంపిన లింక్ క్లిక్ చేసి తన బ్యాంకు ఖాతా నుంచి రూ.10 జమ చేశాడు. అంతే కొద్ది సేపటికి అదే ఖాతా నుంచి పలు దఫాలుగా ఉపసంహరణ అయినట్టు బ్యాంకు నుంచి మెసేజ్లు రావటం ఆరంభించాయి. తీరా ఇదెంతని చూసుంటే ఖాతాలో ఉన్నరూ.77 వేలు మాయమయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కింద కేసు నమోదైంది. వాస్తవానికి అది జొమాటో నంబరు కాదు. ఈ విషయం తెలియని విష్ణు ఫోన్ చేయటమే పెద్ద పొరపాటుగా మరికొందరు చెపుతున్నారు.