చెన్నై మహానగరంలో కాంగ్రెస్ కమిటీ జాతిపతి మహాత్మాగాంధీ సేవలను స్మరిస్తూ దేశంలోనే అత్యధిక ఎత్తుతో ఓ పతాక స్తంభాన్ని నెలకొల్పనుంది. ఈ మేరకు నగరంలోని స్థానిక రాయపేటలోని టీఎన్సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్లో శనివారం పతాకస్తంభస్థాపన, పునాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మేళతాళాల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పునాది రాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి మాట్లాడుతూ... మహాత్మాగాంధీ 150వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని టీఎన్సీసీ తరపున దేశంలోనే అతి పెద్ద పతాక స్తంభాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ పతాక స్తంభంపై సంవత్సరంలో ఏడుసార్లు పార్టీ జెండాను మోటార్ పంపింగ్ సాయంతో ఎగురవేయనున్నట్టు తెలిపారు. వచ్చే జనవరి నాటికి ఈ పనులు పూర్తవుతాయని, గాంధీజి వర్ధంతి రోజున 150 అడుగుల ఎత్తు పతాకస్తంభంపై పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్, టీఎన్సీసీ కార్యదర్శి కె.చిరంజీవి, మాజీ అధ్యక్షుడు ఎస్.తిరునావుక్కరసర్ తదితరులు పాల్గొన్నారు.