కృష్ణా జిల్లా గుడివాడలో మద్యానికి డబ్బులు ఇవ్వటం లేదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చున్నీతో ఉరివేసి అతి కిరాతకంగా హతమార్చాడో ప్రబుద్ధుడు. గుడివాడలో నివాసం ఉంటున్న శ్రీకాంత్, అనూష మూడేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు వారి కాపురం సజావుగానే ఉన్నా, పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని గత కొన్ని రోజులుగా అనూషను వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తాపీ మేస్త్రీగా పని చేసే శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని మంగళవారం రాత్రి చున్నీతో హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.