హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ తమిళనాట తెలుగు భాషను కాపాడుకోవడానికి ఇక్కడి తెలుగు వారందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలని అన్నారు. ఇప్పటికే తమిళనాట తెలుగు మాద్యమంలో చదువుకునే విద్యార్థులు 2016 నుంచి తీవ్ర గందరగోళం మధ్య పరీక్షలను రాయాల్సి వస్తుందని, ఈ ఏడాది నుంచి అయినా దానికి తెర దించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటి వరకు ఏటా ఫిబ్రవరి చివరి వారంలో ఏ భాషలో పరీక్షలు రాయాలనే మీమాంసను విద్యార్థులు ఎదుర్కొనాల్సి వస్తోందని. దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కోర్టు దాకా వెళ్లడం, అక్కడి నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందడం…పరిపాటిగా మారిందని వివరించారు. ఈ విషయంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోం శాఖ మంత్రి, గవర్నర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…ప్రభృతులను కలసినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే 2006లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్బంధ తమిళ బోధనా చట్టం కారణంగా తెలుగు, కన్నడ, మలయాళం విద్యార్థులు వారి మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసుకునే ఆస్కారం కోల్పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం- ఒకే భాష అంటూ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కేతిరెడ్డి.