హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం ఇక నుంచి కల్యాణ-కర్ణాటకగా పేరు మార్చుకోనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంగళవారంనాడు కలబురగిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఇవాల్టి నుంచి కల్యాణ-కర్ణాటక రీజియన్గా హైదరాబాద్-కర్ణాటక రీజియన్ పేరు మార్పు సంతరించుకుంటోందని చెప్పారు. ఇది కన్నడ ప్రజల చిరకాల డిమాండ్ అని తెలిపారు. పేరు మార్పు అనంతరం కల్యాణ-కర్ణాటక ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక సచివాలయాన్ని (సెక్రటేరియట్) కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు యడియూరప్ప తెలిపారు. కర్ణాటకలో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం కీలకమైనది. గుల్బర్గా, బీదర్, రాయచూరు, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం.. హైదరాబాద్ కేంద్రంగా ఉండే నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. దశాబ్దాలుగా ఈ ఆరు జిల్లాలను హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు.