తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మరో 8 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుకున్నారు. కచ్చలూరు వద్ద నాలుగు, దేవిపట్నంలో మూడు, పోలవరంలో ఒక మృతదేహం లభించాయి. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వీరి ఆచూకీ కోసం నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిలో జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలు లభించగా, మరో 30 మంది కోసం గాలిస్తున్నారు. పడవలో మొత్తం 73 మంది ఉండగా అందులో 27 మంది సురక్షితంగా బయటికి రాగా 46 మంది గల్లంతయ్యారు. అందులో 16 మంది మృతదేహాలు దొరికాయి. మరో 30 మంది ఆచూకీ కనుగొనాల్సి ఉంది. ఈ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. మిగిలిన వారి ప్రాణాల మీద ఆశ లేకపోయినా కనీసం కడచూపైనా దక్కితే అంతే చాలంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. దొరికిన మృతదేహాల్లో తమ వారి మృతదేహాలు ఉన్నాయోమోనన్న ఆశతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం వారు కూడా దొరికన వారిలో తమవారు ఉంటారేమోనని హూటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారు.