చిత్తూరు జిల్లా పుంగనూరులో తనకు కావాల్సిన డబ్బుల కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తున్న ప్రియుడిని, మరో ప్రియుడితో కలిసి ఓ యువతి హత్య చేసిన ఘటన నిన్న వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైంది. పలమనేరు డీఎస్పీ అరీపుల్లా వెల్లడించిన వివరాల మేరకు, ఖాదర్ భాషా, మల్లికా భాను పట్టణంలో నివాసం ఉంటూ కొంతకాలం క్రితం విడిపోయారు. ఆపై షబ్బీర్ అనే వ్యక్తి మల్లికను చేరదీశాడు. వారిద్దరూ కలిసుంటున్న క్రమంలో, చెడు అలవాట్లకు బానిసైన షబ్బీర్, తన అవసరాల నిమిత్తం ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయసాగాడు.
అతని వేధింపులతో విసుగెత్తిపోయిన మల్లిక, చాంద్ బాషా అనే మరో యువకుడికి దగ్గరైంది. ఇద్దరు కలిసి షబ్బీర్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. తాగిన మైకంలో నిద్రిస్తున్న షబ్బీర్ మెడకు లుంగీని బిగించి, హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి, కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును విచారించారు. అతన్ని చంపింది మల్లికా భాను, చాంద్ బాషా అని కనిపెట్టి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండ్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.