వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపంతో ప్రేమజంట పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. కల్వటాల గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన రాముడు, ఓళమ్మల రెండో కుమారుడు గుల్లకుంట మనోజ్కుమార్ (20), అదే మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన మామిళ్ల రామయ్య, రామసుబ్బమ్మల కుమార్తె వెంకటలక్ష్మి (19) జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోగా కులాలు వేరుకావడంతో వెంకటలక్ష్మి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోలేదు.
ఇరువురినీ గట్టిగా మందలించారు. దీంతో ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక శుక్రవారం ఉదయం జమ్మలమడుగు నుంచి ఇద్దరూ కలిసి అహోబిలం చేరుకున్నారు. ఎగువ అహోబిలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ప్రహ్లాదబడికి చేరుకుని వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. శనివారం వీరిని చూసిన కొందరు భక్తులు సమీపంలోని మాలోలా నరసింహాస్వామి సన్నిధిలో కాపాలా ఉన్న చెంచులకు సమాచారమిచ్చారు. దీంతో ఎవరో భక్తులు నల్లమల అడవిలో నడుస్తూ ఆకలికి తట్టుకోలేక పడిపోయి ఉంటారని అన్నం, నీళ్లు తీసుకోని వెళ్లారు. అయితే అప్పటికే విగతజీవులుగా పడిఉండటంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటాన్ని గమనించిన చెంచులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మనోజ్కుమార్ జేబులో ఉన్న ఆధార్కార్డు ఆధారంగా ఈ సమాచారాన్ని అతడి కుటుంబసభ్యులకు చేరవేశారు. ఇరువురి మృతదేహాలను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.