ఏపీలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలను అందించేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. ఇందులో 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందించగలమో వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలు, సంక్షేమ పథకాల అమలు ప్రణాళికపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిగామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్లలో ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నామని.. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్కు ప్రత్యేకంగా ఒక నంబర్ ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.