ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిదంబరానికి ఈడీ కేసులో బెయిల్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 01:53 PM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఇంకా ఊరట లభించలేదు. ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 26వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో మాత్రం చిదంబరానికి ముందస్తు బెయిల్‌ లభించింది. ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో బుధవారం సాయంత్రం చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హైడ్రామా అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆ కస్టడీ సోమవారం పూర్తవనున్నందున అదే రోజున ఆయన అరెస్టు పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.


ఈడీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు


మరోవైపు ఈడీ దర్యాప్తులో ఉన్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో చిదంబరానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఈ కేసులో ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. చిదంబరానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆగస్టు 26 వరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. అయితే ఆయన విచారణకు సహకరించాలని సూచించింది. ఈడీ, సీబీఐ రెండు కేసులపై సోమవారం మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com