ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు దాదాపు అదుపులోకి వచ్చాయి. దీంతో శుక్రవారం నుంచే జమ్మూకశ్మీర్ ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. పాఠశాలల సైతం వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయని జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారాంతం తర్వాత ప్రాంతాల వారీగా పాఠశాలలు తెరుచుకోనున్నాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన రద్దు అనంతరం ఆగస్టు 5 నుంచి విధించిన ఆంక్షల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టంచేశారు. మొత్తం 12 జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, కేవలం 5 జిల్లాల్లో మాత్రమే స్వల్ప ఆంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు. మరోవైపు టెలిఫోన్ సేవలు సైతం దశలవారీగా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.