జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తీసుకువస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని పవన్ స్పష్టం చేశారు. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని.. అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపబోనని పవన్ తేల్చి చెప్పారు. జనసేన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాను సత్యం కోసం పనిచేసేవాడినని, ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని కోరారు. అలా కాకుండా రోడ్ మీదకు వెళ్లి, సోషల్ మీడియాలో చెప్తే వినటానికి ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదని నేతలు, కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘నా బలం నాకు తెలుసు.. నా బలహీనత నాకు తెలుసు..’’ అని పేర్కొన్నారు. జనసైనికులు అంతా వరదబాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అభిమానుల అత్యుత్సాహంపై స్పందించిన పవన్.. ‘‘మీతో కలిసి ఫోటోలు దిగటానికి ఇబ్బందేమీ లేదు. అయితే ఒకేసారి అందరూ మీద పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతోంది’’ అని చెప్పారు.