భారతదేశంలో విభిన్న మతాలకు, కులాల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచ దేశాల్లో భారతదేశానికే సొంతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడుతున్న భారత్ లో ప్రతీ పండుగల్లోను..వేడుకల్లోను మతసామరస్యం వెల్లివిరుస్తుంటుంది. హిందూ ముస్లిం భాయీ..భాయ్ అనే సంస్కృతి భారతదేశంలో పరఢవిల్లుతుంటుంది. మతసామరస్యాన్ని చాటిచెప్పే మరో అరుదైన ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో. హిందూ యువతి మృతదేహానికి ముస్లింలు దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేశారు.
వివరాల్లోకి వెళితే..సినిమాలో చూపించినట్లుగా వారణాసిలో నివసించే హోరీలాల్ విశ్వకర్మ పక్షవాతంతోను..అతని భార్యకు గుండె సంబంధిత వ్యాధులతోను బాధపడుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. తల్లిదండ్రులు పనిచేసి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉండడంతో పెద్ద కుమారుడే అన్నీ అయి చూసుకుంటున్నాడు.కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. ఈ కష్టాలు చాలవన్నట్లుగా ఆ కుటుంబాన్ని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. కుమార్తె సోనికి మలేరియా వ్యాధి సోకింది. వైద్యం చేయించే స్తోమత కూడా లేకపోవటంతో మలేరితో ఆదివారం (ఆగస్టు 11)న చనిపోయింది.
హోరీలాల్ విశ్వకర్మ కుటుంబ దుస్థితి చూసిన ముస్లిం సోదరులు చలించిపోయారు. సోని అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చారు. స్థానికంగా ఉండే ముస్లిం సోదరులంతా కలిసి దగ్గరుండి సోనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వారే స్వయంగా తమ భుజాలపై సోని పాడెను మోసారు. ముస్లింలు అల్లాను తప్ప ఎవ్వరి నామాన్ని నోటితో ఉచ్ఛరించరు. కానీ సోనీ పాడె మోసిన ముస్లిం సోదరులు “రామ్ నామ్ సత్య హై” రామజపం చేస్తూ అంత్యక్రియల కార్యక్రమాన్ని దగ్గరుండి స్వయంగా నిర్వహించారు. అనంతరం హోరీలాల్ కుంటుంబానికి ఆర్థికంగా సాయం అందించారు. భారతదేశంలో మతసామరస్యాన్ని తెలియజేసే ఘటనగా చెప్పుకోవాల్సి సందర్భం.