దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. జకీర్ నగర్లోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. భవనంలోని ఎలక్ట్రిసిటీ బాక్స్లో చెలరేగిన మంటలు భవనమంతా వ్యాపించాయి. దీంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు భవనంపై నుంచి కిందకు దూకారు. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఏడు కార్లు, ఎనిమిది బైక్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.