శ్రీనగర్ : జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కావడంతో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి దినం అని ఆమె ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఈ రోజు అత్యంత చీకటి దినం అని పేర్కొన్నారు. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కశ్మీర్కు ఇచ్చిన మాట తప్పారు. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం అని ముఫ్తీ మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయిందంటూ ఆమె మరో ట్వీట్ చేశారు. ప్రజలను భయపెట్టి కశ్మీర్ను లాక్కోవాలని చూస్తున్నారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్ విఫలమైందని ముఫ్తీ పేర్కొన్నారు.