రోహిత్ శర్మతో తనకి విభేదాలు లేవని మీడియాతో స్పష్టం చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ...ఈ మూడు రోజుల వ్యవధిలో రెండు టీమ్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కోహ్లీ, జడేజా, నవదీప్ షైనీ, ఖలీల్ అహ్మద్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ ‘స్క్వాడ్ 100’ అంటూ ఒక ఫోటోలో రాసుకొచ్చాడు. ఈ రెండింటిలోనూ రోహిత్ శర్మ లేకపోవడం గమనార్హం కాగా ఈ ఫోటోలతో వారిద్దరి విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఇక ఆ ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ ఎక్కడ? అంటూ అభిమానులందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే..ప్రపంచకప్ సెమీఫైనల్స్లో భారత జట్టు ఓడినప్పటి నుంచి కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్లో భారత్ తుది జట్టు ఎంపిక, సెమీస్లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు నిర్ణయాల్ని వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న తనని కనీసం సంప్రదించకుండా కెప్టెన్ కోహ్లీ ఏకపక్షంగా తీసుకున్నాడని రోహిత్ శర్మ గుర్రుగా ఉన్నాడు. దీంతో.. సెమీస్లో భారత్ జట్టు ఓడిపోగానే టీమిండియా ఆటగాళ్లతో కలిసి రాకుండా.. నాలుగు రోజులు ముందుగానే సొంత ఖర్చులతో రోహిత్ శర్మ ఇంగ్లాండ్ నుంచి భారత్కి వచ్చేశాడు. టీమిండియాలో ఏదో జరుగుతోంది..? అని అందరికీ అనుమానం వచ్చింది ఇక్కడే. ఆ తర్వాత కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలను ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మ అన్ఫాలో కావడం ఈ విభేదాల వార్తలకి మరింత ఆజ్యం పోశాయి.
అలాగే రెండు రోజుల క్రితం రోహిత్శర్మ ట్విటర్లో తన ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. ‘నేను జట్టు కోసం బరిలోకి దిగను.. దేశం కోసం ఆడతాను’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను అంతర్లీనంగా కోహ్లీని ఉద్దేశించి పోస్టు చేశాడని నెటిజెన్లు భావిస్తున్నారు. తాజాగా కోహ్లీ ఫొటో కూడా.. వీరి మధ్య గొడవలు ఉన్నాయనే అనుమానాల్ని రేకెత్తిస్తోంది.