ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్‌ బాబు త్వ‌ర‌లో సైకిల్‌ యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 06:36 PM

గత ఎన్నికల్లో ఏపీలో ఘోర ఓటమి చవిచూసాక తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. మరో వైపు ఇదే అదునుగా భావించి బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ నుండి వీలైనంత మంది నేతలను లాగి వచ్చే ఎన్నికల వరకు ఏపీలో బలపడాలని చూస్తుంది. మరి టీడీపీ కూడా వచ్చే ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తుంది. ఇక తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్న నాయకుడిగా, వారసుడిగా లోకేష్‌ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన లోకేష్ ప్రజలకు అత్యంత చేరువ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలానే తన మాటతనం కూడా పెంచి భవిష్యత్ నాయకుడిగా గుర్తింపు పొందాలని భావిస్తునాడట ... ఇప్పటికే లోకేష్ పని తీరుపై కాస్త అసంతృప్తిగా ఉన్న నేతలు..వారు పార్టీ వీడక ముందే.. లోకేష్ గాడిలో పడాలని భావిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే...వచ్చే ఎన్నికలే లక్ష్యంగా లోకేష్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దీని కోసం ఆయన ప్రజలతో దగ్గరయ్యేందుకు ఓ ప్లాన్‌ చేస్తున్నారట. అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, పాదయాత్రతో ప్రభంజనం మోగించారు. నారా చంద్రబాబు నాయుడు సైతం, పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. ఇక వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర, అఖండ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే ఒరవడిలో లోకేష్‌ బాబు కూడా యాత్రకు సిద్దమవుతున్నారట. అయితే అందరిలా కాకుండా, కాస్త డిఫరెంట్‌గా, మరో టైప్‌‌ టూర్‌తో ప్రజలతో దగ్గరయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఇంతకీ ఏంటా యాత్ర? . అదే సైకిల్‌ యాత్ర. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్లకు పైగా టైముంది. కానీ అంతలోపు పార్టీని కాపాడుకోవడం తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారట లోకేష్. ఎన్నికల టైంకు పాదయాత్రకు శ్రీకారం చుట్టినా, ఇప్పటికిప్పుడు పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి సైకిల్‌ యాత్ర బెటరని భావిస్తున్నారని, టీడీపీలో చర్చ జరుగుతోంది. సైకిల్‌, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు. అదే సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ, జనాలను, కార్యకర్తలను పరామర్శిస్తూ, పలకరిస్తూ పోతే, సైకిల్ యాత్ర సూపర్‌ హిట్టవుతుందని అనుకుంటున్నారట తెలుగుదేశం శ్రేణులు. ఎన్నికల ఘర్షణలు, ఎన్నికల తర్వాత గొడవలతో చాలామంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారని ఇప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్‌ కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, టీడీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని కూడా వారు ఆరోపణలు సంధిస్తున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, బాధిత కుటుంబాలను ఇప్పటికే పరామర్శ చేశారు. చాలా జిల్లాల్లో పర్యటించి, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చారు. ఆర్థికంగా ఆదుకుంటామని, కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామి ఇచ్చారు. అయితే చంద్రబాబు ఒక్కరే తిరిగితే, చాలా టైం పడుతుందని భావిస్తున్న లోకేష్, తాను కూడా ఏదో రకంగా ప్రజల వద్దకు వెళ్లాలని అనుకుంటున్నారట. అందుకు సైకిల్‌ యాత్ర మేలని ఆలోచిస్తున్నారట. లోకేష్‌ బాబు సైకిల్‌ యాత్ర ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందట. త్వరలో చంద్రబాబు చెవిలో వేసి, అప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారట లోకేష్. బాబు కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే, సైకిల్ మీద రయ్‌రయ్‌ మంటూ వెళ్లేందుకు సిద్దమవుతున్నారట లోకేష్. నాయకుడు ఎవరైనా ప్రజల్లో నిత్యం వుంటేనే, నాయకుడు అవుతాడు. పవర్‌లో ఉన్నంత కాలం, మంత్రిగా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు లోకేష్. ఆ తర్వాత ఎన్నికల టైంలో జనాల దగ్గరకు వెళ్లారు తప్ప, ప్రజా సమస్యలపై నేరుగా ఎలుగెత్తింది లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ ఆలోచిస్తున్నారట. సైకిల్ యాత్ర ద్వారా వీలైనన్ని ప్రాంతాలను చుట్టేస్తే, ప్రజా నాయకుడిగానూ మద్దతు లభిస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు లోకేష్. గ్రామవాలంటీర్లు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కరెంటు కోతలపై వ్యంగ్యబాణాలు విసురుతున్నారు. ఎన్నికల తర్వాత నేరుగా మీడియా ముందుకు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ, టీడీపీ వాణిని వినిపిస్తున్నారు. ఇప్పుడు డైరెక్టుగా కార్యకర్తల దగ్గరకు వెళ్లి, వారిలో జోష్‌‌ నింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అతిత్వరలో లోకేష్‌ సైకిల్‌ యాత్ర మొదలవుతుందని, టీడీపీలో చర్చ జరుగుతోంది. మరీ లోకేష్ కు కూడా సైకిల్ యాత్ర  వర్క్ అవుట్ అయి వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కుంటారా అనేది ప్రశ్న.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com