ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలంటే రోగుల నుండి డబ్బులు వసూలు చేయడమే ధ్యేయంగా పని చేస్తాయన్నది సాధారణంగా సామాన్యులలో ఉన్న అభిప్రాయం. చాలా సందర్భాలలో అది నిజమనిపించే ఘటనలు జరిగాయి. అందుకు భిన్నంగా ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం ఒక బాలుడి వైద్యం కోసం ఏకంగా రూ.11లక్షలు సమకూర్చిన సంఘటన ఇది. ఢిల్లీకి చెందిన అలీ హమ్లా అనే ఏడేళ్ల బాలుడు లివర్ సమస్యతో అతడు ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆ బాలుడి లివర్ పూర్తిగా చెడిపోయిందని తేల్చారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే ఆ బాలుడిని బతికించడానికి ఉన్న అవకాశం అని నిర్ధారణకు వచ్చారు. అయితే అందుకు రమారమి 15లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలీ తల్లిదండ్రులు పేదలు కావడంతో అంత మొత్తం భరించే స్థితిలో లేరు. దీంతో ఆసుపత్రి వైద్యులే స్వయంగా పూనుకుని తమకు తెలిసిన సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.11 లక్షల రూపాయలు సేకరించారు. బాలుడి తండ్రి మూడు లక్షల రూపాయలు భరించడానికి సిద్ధమయ్యారు. దీంతో బాలుడి తండ్రి కాలేయం నుంచి కొంత భాగాన్ని కుమారుడికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతమైంది. మాక్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని, మానవతను చాటుకున్న ఆ ఆసుపత్రి వైద్యులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.