శాసనసభలో గురువారం బల నిరూపణ చేసుకునేందుకు విశ్వాస తీర్మానంలో మద్దతు పొందాల్సిన కర్నాటక సిఎం కుమారస్వామి స్పీకర్ ధర్మమా అని సభను శుక్రవారం వాయిదా వేయించారు.
స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయమని సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలో అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ మద్దతు దారులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి సంకీర్ణంలోని భాగస్వామ్య పక్షాలు జెడిఎస్- కాంగ్రెస్లు. తాజాగా తమ శాసనసభ్యుడు కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నేత సిద్దరామయ్య సభలో ప్రకటించడం, దీనిపై స్పీకర్ స్పందించడం క్షణాలలో జరిగాయి. దీంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది.
అయితే శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు తన బలం నిరూపించుకోవాలంటూ ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వాజూభాయ్ వాలా లేఖ రాశారు.అలాగే విశ్వాస పరీక్షను వెంటనే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్కు ఓ సందేశం పంపారు.
స్పీకర్కు సంబంధించి వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవటమేంటని, కేంద్రం వెనుక ఉండి గవర్నర్తో డ్రామాలు నడిపిస్తోందంటూ అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.