రైతు రుణమాఫీ అందక, కనీసంవడ్డీలు కట్టలేక తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేసీ పెంట గ్రామంలో పెరుమాళ్ అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే పెరుమాళ్ తనకున్న ఎకరం ఎనభై మూడు సెంట్ల భూమిలో పంటలు పండిస్తూ, అయినకాడికి అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. నీటి సౌకర్య కరువవ్వటంతో ఈ మధ్య కాలంలో తన పొలంలో రెండు సార్లు బోరు వేయించాడు. అయినా నీటి జడలేక పోవటంతో ఆ బోర్లు పనికి రాకుండా పోయాయి. బోర్లు కోసం బ్యాంకులోను, ఇతరుల దగ్గర అప్పుడు చేసాడు. దీంతో అప్పులపై వడ్డీలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో అవి తీరే మార్గం కనిపించక పెరుమాళ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ విషయమై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.