వైసిపి సభ్యులు సభా సాంప్రదాయాలు పాటించేలా స్పీకర్ చూడాలని తెలుగుదేశం సభ్యుడు పయ్యవుల కేశవ్ కోరటంపై కాంగ్రెస్ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. సభ ఆర్డర్లో ఉండేలా చూడాలని కోరే నైతిక హక్కు పయ్యవులకు లేదని, గత ప్రభుత్వ హయాంలో సభ నిర్వహణాలో అప్పటి స్పీకర్ విఫలమయ్యారని, నగరి ఎమ్మెల్యే రోజాపై గతంలో అసెంబ్లీలోకి రాకుండా ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని, ఉరి శిక్ష వేసిన ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, రోజాకు ఆ అవకాశం కూడా కల్పించలేదని చెవిరెడ్డి విమర్శించారు. రోజాకు తన వాదన వినిపించేందుకు అవకాశం కల్పించకుండా మార్షల్స్తో బయటకు పంపించిన టీడీపీ సభా సాంప్రదాయాలను గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెవిరెడ్డి దుయ్యబట్టారు.
ఈ విషయాలను తను వీడియో రికార్డులతో సహా నిరూపిస్తానని, లేని పక్షంలో రాజీనామా చేస్తానని, అవి యదార్ధమైతే పయ్యవుల రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. వైసీపీ నేతలు సభా మర్యాదలు పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడం విడ్డూరంగా ఉందనిఎద్దేవా చేసారు.