ఏపీలో పొలిటిక్స్ రంజుగా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ప్రధానంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేసుకుంటున్నారు. దేవుడు కూడా చాలా గొప్ప స్క్రిప్ట్ రాశారు...23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి అక్షరాల 23 సీట్లు మాత్రమే వచ్చాయంటూ టీడీపిని ఉద్దేశించి..ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో చెప్పడానికి ఇది నిదర్శనమంటూ విమర్శించారు. దీనికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు.
దేవుడి స్క్రిప్ట్లో ట్విస్టులు ఉంటాయి..జగన్ గారూ.. దేవుడు..స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ..రాస్తూ..కామా పెట్టాడంతే..అది పుల్ స్టాప్ అనుకున్నారు..ఈ గ్యాప్లోనే మీరు గుడిని..గుడిలో లింగాన్ని మింగేయాలని అనుకుంటున్నారంటూ సెటైర్స్ వేశారు. దేవుడు కామా తర్వాత మళ్ల స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాడని..అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడన్నారు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఒకే చేయించాడని చెప్పుకొచ్చారు.
టీడీపీ హాయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే..అవి ముట్టుకుంటే షాక్ కొడుతాయని కేంద్రంతో లేఖ రాయించాడన్నారు. దేవుడి స్క్రిప్ట్లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయని ఎద్దేవా చేశారు. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకొనేందుకు దేవుడే ఓ ఛాన్సిఛ్చాడు..సెక్రటేరియట్లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా..అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా..చంద్రబాబుకి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకో..అని స్క్రిప్ట్లో మళ్లీ కామా పెట్టాడని లోకేష్ ట్వీట్స్లో వెల్లడించారు.