ఎర్రగా బుర్రగా ఉందని, రెండో పెళ్లంగా వచ్చేందుకు సిద్దమైందని నచ్చి, మెచ్చి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బులతో సహా పెళ్లి కూతురు ఉడాయించిన ఘటన హర్యానాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన సురేందర్ (36) భార్య కొద్ది రోజుల క్రితం చనిపోగా.. ఇంట్లో వాళ్లు కాదన్నా ఆయన 28 ఏళ్లు వయసున్న ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. 15 రోజులు బాగానే గడిచినా, ఆపై తన భార్య కనిపించక పోవటంతో చుట్టుపక్కల వారిని అడిగాడు. తెలీదంటూనే ఓ మిత్రుడు బస్సు ఎక్కి వెళ్లడం తను చూసానని చెప్పాడు. దీంతో ఏం పనుందో ఏమో? అనుకుంటూ ఇంటికొచ్చి చూస్తే, బీరువాలో తను ఎదురు కట్నంగా ఉంచిన డబ్బులతో పాటు నగలు నట్రా కనిపించలేదు. పైగా బట్టలన్నీ చిందరవందరగా ఉండటంతో ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావటంతో పోలీసులని ఆశ్రయించాడు.
ఇందుకు తన భార్య ఆచూకి కోసం పెళ్లి ఫోటోని ఇచ్చే సరికి నివ్వెరపోవటం పోలీసుల వంతైంది. ఈ సంబంధం ఎలా వచ్చింది ఆరా తీస్తే, తనకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదు. ఒక రకంగా కుటుంబంలోనే ఒంటరివాడిని. మే 17న జోగిందర్, వీరెందర్ అనే ఇద్దరినీ జింద్లో కలిశాను. వారే నాకు ఈ పెళ్లి సంబంధాన్ని చూపించారు అని సురేందర్ చెప్పాడు. అయితే ఆమె ఒక దొంగ అని, వీరికి ఓ గ్రూపు ఉందని, పెళ్లి కాని వారిని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తమ స్టేషన్లో 20 పైగా కేసులు ఇలాంటివే నమోదయ్యాయని వారు చెప్పడంతో పెళ్లి అవుతుందన్న ఉత్సాహంతో ఆమె గత చరిత్ర ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నందుకు తన కొంపమునిగిందని అబోదిబోమంటున్నాడు.