అయోధ్య : అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన మేళాలో తొక్కిసలాట సంభవించింది. ఈ తొక్కిసలాటలో దులారి దేవి అనే 65 సంవత్సరాల వయస్సున్న మహిళ మృతి చెందింది. ఆమె భర్త సాధురామ్ మాట్లాడుతూ తాము తులసి ఉద్యాన్లో పూజ ముగించుకుని వస్తుండగా తొక్కిసలాట జరిగిందని, తన భార్య కింద పడిపోగానే పలువురు ఆమెను తొక్కుకుంటూ వెళ్లారని చెప్పారు. అయితే ఫైజాబాద్ ఎస్ఎస్పి అనంత్ దేవ్ మాట్లాడుతూ ఆ మహిళ గుండెపోటుతో మరణించిందని అన్నారు. మరొక సంఘటనలో లఖ్పతి దేవి (70) గాయపడ్డారు. ఆమెను జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా సరయు నది ఒడ్డున ఉన్న బంధా త్రిషా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది గాయపడ్డారు. ఎంతమంది గాయపడ్డారనే విషయాన్ని స్థానిక పాలనాయంత్రాంగం నిర్ధారించలేకపోతున్నది.