దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కొత్త పోస్ట్ వరించింది. వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను కేంద్ర హోంశాఖ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా నియమించింది. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. చాలా నిక్కచ్చిగా పనిచేసే అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న స్టీఫెన్ రవీంద్రను జగన్ ఏరికోరి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే రవీంద్ర ఏపీకి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్ర అనంతపురానికి చెందినవారని అధికారిక వర్గాలు తెలిపాయి.