ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఢీలా పడిపోయింది. 37 ఏళ్లలో టీడీపీ ఎప్పుడు ఇంతటి దారుణమైన పరిస్థితి చేరలేదు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం టీడీపీకి కేవలం 23 స్థానాలు మాత్రమే రావడంతో.. ఆ పార్టీకి బలమైన నేతలు అవసరమని, టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ బాధ్యలను అప్పగించాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మొన్న వెలువడిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. వచ్చే ఎన్నికల వరకు టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని నాని అన్నారు. టీడీపీ మళ్లీ కోలుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాకతోనే సాధ్యమని, కానీ అది ఇప్పుడే జరగదని, 2024 తర్వాతే జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని పేర్కొన్నారు. అయితే నాని చెప్పిన మాటలు విన్న టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దీనిపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.