ముంబయి: ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ఇండియన్ ఐడల్లో తెలుగు గాయకుడు ఎల్వీ రేవంత్ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన తుది పోటీలో ఆయన విజేతగా నిలిచినట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ప్రకటించారు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్.. హైదరాబాద్లో గాయకుడిగా స్థిరపడ్డారు. పోటీలో విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించారు. పంజాబ్కు చెందిన ఖుదా బక్ష్ రెండో స్థానంలో నిలవగా.. మరో తెలుగు కుర్రాడు పీవీఎన్ఎస్ రోహిత్ మూడో స్థానం సాధించారు. ఇండియన్ ఐడల్ బిరుదుతోపాటు రూ.25లక్షల నగదు బహుమతిని రేవంత్ దక్కించుకున్నారు. సోని మ్యూజిక్ సంస్థతో పాటల ఒప్పందాన్ని కూడా గెలుచుకున్నారు. మహీంద్ర కేయూవీ100 వాహనం కూడా కానుకగా దక్కింది. రేవంత్కు ఇప్పటికే తెలుగు సినీపరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. బాహుబలి చిత్రంలోనూ ఆయన ఓ పాట పాడారు. ‘‘ఇంటికి వెళ్లి నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విజయంపై సంబరాలు చేసుకుంటా. ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడతా. మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు’’ అని రేవంత్ అన్నారు.