భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్పై లైంగిక వేదింపుల కేసులో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాది బెయిన్స్ సీల్డ్ కవర్లో పత్రాలను కోర్టుకు సమర్పించారు. తాను సమర్పించిన పత్రాల్లోని సమాచారాన్ని ప్రివిలేజ్గా పరిగణించాలని కోర్టు వారిని కోరారు. బెయిన్స్ కోరుతున్న వాటికి భారత ఆధారాల చట్టం 126 వర్తించదని ఏజీ వేణుగోపాల్ ఇచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. ఎలాంటి పత్రాలనైనా పరిశీలించే హక్కు కోర్టుకు ఉందని తెలిపింది. బెయిన్స్ అఫిడవిట్తోపాటే సదరు మహిళ ఆరోఫణలపైనా విచారించాలని మరో న్యాయవాది ఇందిరా జైసింగ్ అభిప్రాయపడ్డారు. బెయిన్స్ దాఖలు చేసిన అఫిడవిట్.. విచారణ కమిటీపై ఎలాంటి ప్రభావం చూపదని ధర్మాసనం తెలిపింది. సీజేఐని ఇరికించే కుట్ర ఆరోపణలను నిగ్గుతేల్చేందుకే ఈ విచారణ చేపడుతున్నామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై కుట్రలు చాలా తీవ్రతరమైనవని జస్టిస్ అరుణ్ మిశ్రా పునరుద్ఘాటించారు. ధన రాజకీయ శక్తితో సర్వోన్నత న్యాయస్థానం నడవదని, ఈ నిజం దేశం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు.