ఎన్నికల కోడ్ నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ముగిశాయని పాలనపై దృష్టి పెట్టకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం తెదేపా ప్రజాప్రతినిధులతో ప్రజా సమస్యలు, తాగునీటి ఎద్దడిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేయాలని సూచించారు. తాగునీరు వంటి సమస్యల పరిష్కారాన్ని సాధారణ పరిస్థితుల్లో మాదిరిగానే పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్రమంతా ఒకే కుటుంబం అనే భావన ప్రజల్లో బలపడాలని.. శాంతిభద్రతలను ఎవరైనా రెచ్చగొడితే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల విధులు లేని అధికారులు రాష్ట్రాభివృద్ధి దృష్టి కోణంలో బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. శ్రీలంకలో జరిగిన దాడులను మానవతావాదులంతా ఖండించాలని.. దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా ఈసీఐ ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఈ అంశాలతోపాటు ఎన్నికల అనంతర పరిణామాలపై కూడా చంద్రబాబు సమీక్షించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంలు, ప్రతిపక్షపార్టీ నేతల వ్యాఖ్యలు, ఓటింగ్ సరళి తదితర అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన చర్చించినట్లు సమాచారం.