అత్యవసర సాయం కోసం ఫోన్ చేయడానికి మన దేశంలో కొన్ని ఫోన్ నంబర్లు ఇప్పటికే ఉన్నాయి. 100కు చేస్తే పోలీసులు స్పందిస్తారు. 108కి చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఇంకా మహిళల రక్షణ కోసం కొన్ని నంబర్లు కూడా ఉన్నాయి. బాలల అక్రమ రవాణాను అడ్డుకోడానికి కూడా నంబర్లు ఉన్నాయి. ఇన్నేసి నంబర్లను గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక భారత ప్రభుత్వం అమెరికాలోని 911 నంబర్ మాదిరి 112 హెల్ప్ లైన్ పాన్ ఇండియా నంబరును తీసుకొచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నంబరును తాజాగా దేశంలోని 20 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. వీటిలో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. ఈ నంబరు పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, , తమిళనాడు, గుజరాత్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు, జమ్ముకశ్మీర్, నాగాలాండ్ ఉన్నాయి. దీని కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్)ను నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదాలు, అత్యవసర వైద్యం వంటి సాయం కోరేవాళ్లు 112కి డయల్ చేస్తే సమీపంలోని నెట్ వర్క్ టవర్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) సమాచారం అందుతుంది. స్మార్ట్ ఫోన్ నుంచి చేస్తే జీపీఎస్ వల్ల మరింత సత్వర సాయం అందుతుంది. స్మార్ట్ ఫోన్లలోని పవర్ బటన్ను మూడు సార్లు నొక్కడం, కీ-ప్యాడ్లోని 5 లేదా 9ని కొంతసేపు నొక్కి పెట్టడం ద్వారా 112కి కాల్ చేయొచ్చు. ఈఆర్ఎస్ఎస్ వెబ్సైట్లోకి వెళ్లి కూడా సాయం కోరొచ్చు. 112 ఇండియా మొబైల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.