ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ పనితీరులో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి పది రోజులు కాకముందే గోవధ శాలల నిషేధం, ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు, పాన్, గుట్కాలు నమలకుండా నిషేధం, మహిళలకు రక్షణ కోసం యాంటీ-రోమియో స్క్వాడ్ల నియామకం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు రాష్ట్రాభివృద్ధి కోసం రోజుకు 18-20 గంటలు కష్టపడి పనిచేసేటట్లయితేనే తనతో ఉంటారని, లేదంటే ఇంటికి వెళ్లొచ్చని అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు ఫైళ్లను ఇళ్లకు తీసుకెళ్లరాదని, ఆఫీసుల్లోనే వాటిని పరిష్కరించాలని సూచించారు. కాగా, అక్రమ గోవధ, జంతు వధశాలలపై నిషేధాన్ని నిరసిస్తూ మటన్, చికెన్ షాపులు సోమవారం నుంచి యూపీవ్యాప్తంగా సమ్మె ప్రారంభించాయి. ఎక్కడా మాంసం దొరక్కపోవడంతో ప్రజలు, హోటళ్ల యజమానులు చేపలపై పడ్డారు.