అమరావతిలో బుధవారం తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఆంధ్రాలో కూడా అదే కుట్రతో అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని కనకమేడల ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ముచ్చుమర్రి ప్రాజెక్టులు మూసేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీరందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీనే ప్రధానమని వివరించారు. వీటిని మూసేస్తే రాయలసీమలో సాగయ్యే లక్షల ఎకరాలు సహా, తెలుగు గంగ కాలువ ద్వారా చెన్నైకు తాగునీరందించేందుకు ఏ అవకాశమూ ఉండబోదని చెప్పారు. శ్రీశైలం నీళ్లు లేకపోతే రాయలసీమ ఎడారిగా మారిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్వయంగా కడప జిల్లాకు చెందిన జగన్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ మూసేయాలంటున్న తెలంగాణతో కలిసి అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలో ఉండాలని డిమాండ్ చేశారు. మన ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారిని ప్రశ్నించాల్సిందిపోయి జగన్ మద్దతు తెలుపుతున్నారని ధ్వజమెత్తారు.