రాజస్థాన్ గవర్నర్ బాహాటంగా బీజేపీకి భజన చేసి సంచలనం సృష్టించారు. ప్రధానిగా మళ్లీ నరేంద్రమోడీయే కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయ పార్టీలకు వత్తాసు పలకకూడదు. తటస్థంగానే ఉండాలన్న నిబంధనలను తుంగలోకి తొక్కి రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. తాను బీజేపీ కార్యకర్తననీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ ఆయన అన్నారు. మరోసారి మోడీ దేశ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టడం తధ్యమని ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది.