దేశ ప్రధానిని ప్రశ్నించాలంటే ధైర్యమే కాదని రిస్క్ కూడా ఉంటుందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అయినా కూడా హిట్లర్లాంటి మోదీతో పోరాడి జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడనని ఆయన అన్నారు. గుంటూరులో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్ తాను ఎంపీగా చేసిన అభివృద్ధి పనులపై పుస్తకం విడుదల చేశారు. ''నీతి నిజాయితీ ఉన్నఎంపీగా చేయాల్సిన పనులన్నీ చేశా. పార్లమెంట్లో ప్రధానిని ప్రశ్నించిన వారంలోనే నాకు ఈడీ నోటీసులు పంపించారు. నేను లొంగకపోయే సరికి డిసెంబర్లో మహేశ్ బాబుపై, ఆ తరువాత నా కుటుంబసభ్యులతో పాటు ఫ్రెండ్స్ను టార్గెట్ చేసి ఐటీ రైడ్లు చేశారు. వ్యాపారంగంలో నీతివంతంగా ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కవ పన్నులు చెల్లిస్తున్నాం.'' అని అన్నారు.
అటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతూ ''ఆంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న పోరాటంలో పార్లమెంట్ వద్ద ఒక మైక్ పట్టుకుని అదేదో ఘనకార్యం లాగా మాట్లాడుతున్నాడు. మోదుగుల అడగకముందే నేను ఏం చేశానో ట్రాక్ రికార్డ్పై పుస్తకం సిద్ధం చేశా. ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన మోదుగులకు ట్రాక్ రికార్డు ఉంటే విడుదల చేయాలి.''అని మోదుగులకు సవాల్ విసిరారు.