ల్యాండవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని ఆ దేశ అత్యవసర విభాగం అధిపతి తెలిపారు. ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక కారణాలతో వెనక ల్యాండింగ్ గేర్ సరైన సమయంలో తెరచుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని అంబులెన్సులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.గాయాలైన వారికి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదానికి గల కారణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు.