అమరావతి: అగ్రిగోల్డ్ కేసుపై సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణలో సభలో గందరగోళానికి తెరతీశాయి. పలువురు మంత్రులు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ బాధితుల జాబితాను ఆన్ లైన్లో పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ నిందితుల్లో ఒకరైన సీతారాంను ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. మంత్రి పత్తిపాటి పుల్లరావు భార్య కూడా అగ్రిగోల్డ్కు సంబంధించిన భూములను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసులో మంత్రి పుల్లారావుపై ఆరోపణలు చేసిన జగన్ దీనిపై జూడిషియల్ విచారణ చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డివి అన్నీ అసత్య ఆరోపణలని మంత్రి పుల్లరావు అన్నారు. గతంలో ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తే జగన్ పారిపోయారని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తనపై బురద జల్లితే అది జగన్మోన్ రెడ్డిపైనే పడుతుందని అన్నారు.