ధర్మశాల: విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ఆడి ఫిట్నెస్, ఫామ్ చాటుకున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ధర్మశాల చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో షమి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. షమిని చివరి టెస్టుకు ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సంకేతాలిచ్చాడు. ఈ నేపథ్యంలోనే షమి ప్రాక్టీసులో పాల్గొనడానికి ధర్మశాల చేరుకున్నాడు. ధర్మశాలలో నేటి ఉదయం ఎంతో అందంగా ఉందని ఆయన ఓ ఫొటో ద్వారా అభిమానులకు తెలిపాడు. షమి ఎంపికపై కోహ్లి ఇంకా సెలక్టర్లతో మాట్లాడాల్సి ఉంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టు కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు మంగళవారమే ధర్మశాల చేరుకున్నాయి. తుది జట్టులో షమికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.