దళితులు, మాల, మాదిగ వర్గాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిడ్ క్యాప్ చైర్మన్ గా గూడూరి ఎరిక్సన్ బాబుని నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైసిపిలోకి మారిన ఎంపీ రవీంద్ర బురద జల్లే కార్యక్రమాన్నిఆరంభించాడని, దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారడం అనేది ఆయన ఇష్టమని, అయితే నిందారోపణలు చేయడం తగదన్నారు. అది మంచి సంప్రదాయం కాదన్నారు. దళితులకు చెడ్డ పేరు తేవద్దని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. అవాకులు చెవాకులు మానుకోమని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల వరకు మాదిగలు ఉన్నట్లు తెలిపారు. కార్పోరేషన్ చైర్మన్ గా మాదిగ సామాజిక వర్గానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.